తొట్టంబేడు, చిత్తూరు ఎక్స్ప్రెస్: తొట్టంబేడు మండలం గ్రామపంచాయతీ ఎన్నికల ముందస్తు ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల అవగాహన కార్యక్రమాలతో పాటు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా తొట్టంబేడు మండలం చిట్టత్తూరు గ్రామంలో గ్రామ సచివాలయ అధికారి కే. శాంతి ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొట్టంబేడు డిప్యూటీ ఎంపీడీఓ జి. భార్గవ్ సత్యం హాజరై ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా ఆమోద సభను ప్రారంభించారు. గ్రామ సచివాలయ అధికారులు ముసాయిదా జాబితా ప్రకారం అర్హులుగా గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలను గ్రామసభలో చదివి వినిపించి గ్రామస్తుల ఆమోదం పొందారు.ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ జి. భార్గవ్ సత్యం మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల ముందస్తు ప్రక్రియలో కీలకమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు సర్వేలో వచ్చిన అభ్యంతరాలపై గత నెల 29 నుంచి చేపట్టిన క్షేత్రస్థాయి విచారణ బుధవారంతో ముగియనుందని తెలిపారు.ముసాయిదా జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీగా పేర్ల మార్పు కోసం ఫారం-2, కొత్తగా పేర్లు చేర్చేందుకు ఫారం-3, తమకు తెలియకుండా పేరు చేర్చిన సందర్భంలో తొలగించేందుకు ఫారం-4 ద్వారా ఓటర్లు దరఖాస్తులు అందజేశారని చెప్పారు. వీటి పై ఎంపీడీఓల పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టినట్లు తెలిపారు.క్షేత్రస్థాయి విచారణ పూర్తయిన అనంతరం సెప్టెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లలో అర్హులుగా గుర్తించిన వారి వివరాలను సభల్లో చదివి వినిపించి ఆమోదం పొందుతామని తెలిపారు. అనంతరం సెప్టెంబర్ 7వ తేదీన తుది జాబితాను ప్రచురించనున్నట్లు డిప్యూటీ ఎంపీడీఓ వెల్లడించారు.
