
వి.కోట, చిత్తూరు ఎక్స్ప్రెస్, జూలై 29:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని వీ.కోట మండలంలోని గెస్తంపల్లి గ్రామంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి ఆదేశాల మేరకు మండల టీడీపీ సీనియర్ నాయకుడు సి. రామచంద్రనాయుడు, ఏపీ స్టేట్ వేర్హౌసింగ్ డైరెక్టర్ ఏ.ఎం. రంగనాథ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి తీసుకొచ్చిన ప్రాజెక్టుల గురించి ప్రజలకు వివరించారు. అలాగే గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తూ, ప్రజలకు అవసరమైన పనులను దశలవారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ స్టేట్ వేర్హౌసింగ్ డైరెక్టర్ ఏ.ఎం. రంగనాథ్ మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వానికి విజయాన్ని కానుకగా అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంపై విశ్వాసంతో ప్రతి ఓటరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సి. రామచంద్రనాయుడు, ఏ.ఎం. రంగనాథ్, రాంబాబు, నారాయణస్వామి, ఈశ్వర్, విశ్వనాథ్, శబరీష్, ధీరజ్, దేవరాజ్, మురుగేష్, రమేష్కుమార్, శ్రీరామప్పతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.