
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 14:
కుప్పంలో నిర్వహించనున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ సౌకర్యాల ఏర్పాటుపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జాతర సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జిమ్ దాము కలిసి పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఖాళీ ప్రదేశాలను పార్కింగ్ స్థలాలుగా వినియోగించేందుకు అధికారులకు సూచనలు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ వెలుగులు తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు అధికారులకు సహకరించి జాతరను విజయవంతం చేయాలని కోరారు.