chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 8:03 am Digital Edition : CHITTOORE EXPRESS

క్రీడలకు దగ్గరగా.. ఆరోగ్యానికి మరింత దగ్గరగా కుప్పంలో ఘనంగా 5కే సైకిల్ ర్యాలీ, హెల్త్ వాక్

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, ఆగస్టు 29:

 

జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరిం చుకుని కుప్పం పట్టణంలో 5కే సైకిల్ ర్యాలీ, హెల్త్ వాక్‌ను శనివారం ఘనంగా నిర్వహించారు. కడా కార్యాలయం నుంచి ప్రారంభమైన కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కుప్పం ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ సయ్యద్‌ సైకిల్‌ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితంలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. చదువు తో పాటు ప్రతిరోజూ కొంత సమయం క్రీడలకు కేటాయించాలని విద్యార్థులకు సూచించారు. కుప్పంకు చెందిన హాకీ క్రీడాకారిణి నవనీత కాకినాడలోని ఎస్‌ఏఐ హాకీ అకాడమీకి ఎంపిక కావడంపై ఇన్‌స్పెక్టర్‌ సయ్యద్‌ అభినందించారు. ఆమె ఎంపిక కుప్పం ప్రాంతానికే గర్వకారణమని పేర్కొంటూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కడా కార్యాలయం నుంచి సాగిన సైకిల్‌ ర్యాలీ, హెల్త్‌ వాక్‌లో విద్యార్థులు క్రీడల ప్రాధాన్యతను చాటుతూ నినాదాలు చేశారు. కార్యక్రమం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిపై విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఈఓ రాజారాం, లయన్స్‌ క్లబ్‌ అడ్వైజర్‌ మహేష్‌, అధ్యక్షుడు సెల్వం, డైరెక్టర్‌ జయరామ్‌ నాయుడు, స్థానిక నాయకులు డా. వెంకటేష్‌, రవి నాయక్‌, ఆర్‌.పేట్‌ పాఠశాల హెచ్‌ఎం మంజునాథ్‌, ఫిజికల్‌ డైరెక్టర్లు శేఖర్‌, ప్రవళిక, తాజునిత, ఇంద్రాణి, చంద్రబాబు, సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు, ఏబీవీపీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.