chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 9:24 am Digital Edition : CHITTOORE EXPRESS

కొలతూరు హైస్కూల్‌లో నవచేతన ఏఐ స్క్రీనింగ్ శిక్షణ

పలమనేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్07:

 

పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలం కొలతూరు ఉన్నత పాఠశాలలో నవచేతన ఏఐ స్క్రీనింగ్ శిక్షణ కార్యక్రమం సీడీపీఓ ఉమారాణి అధ్యక్షతన నిర్వహించారు. చిన్నారుల అభివృద్ధి,ప్రారంభ దశలో అభివృద్ధి సంబంధిత సమస్యల గుర్తింపు,కృత్రిమ మేధ ఆధారిత స్క్రీనింగ్ విధానాలపై అంగన్‌వాడీ కార్యకర్తలకు సమగ్ర అవగాహన కల్పించారు. శిక్షణ కార్యక్రమంలో నవచేతన యాప్‌ను మొబైల్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలి, చిన్నారులను ఎలా స్క్రీనింగ్ చేయాలి, వివరాలను ఎలా నమోదు చేయాలి వంటి అంశాలపై క్షుణ్ణంగా శిక్షణ అందించారు. చిన్నారుల అభివృద్ధి మైలురాళ్లను గుర్తించడం, సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా వారి భవిష్యత్ అభివృద్ధికి దోహదపడవచ్చని వివరించారు. రాయల్‌పేట వైద్యాధికారి ఏ. మాధవీలత మాట్లాడుతూ నవచేతన కార్యక్రమం ద్వారా చిన్నారుల ఎదుగుదలపై నిరంతర పర్యవేక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తల సమన్వయంతో చిన్నారులకు మెరుగైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు గీతమ్మ, కల్పన, ఆరోగ్య విభాగానికి చెందిన నాగరాజు,నాగార్జున, భారతి తదితరులు పాల్గొన్నారు. మొత్తం 35 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు శిక్షణ పొందారు. డేటా నమోదు, స్క్రీనింగ్ విధానం, ఫాలోఅప్ చర్యలపై ప్రాయోగికంగా శిక్షణ అందించారు. నవచేతన కార్యక్రమం ద్వారా చిన్నారుల అభివృద్ధిని మరింత సమర్థవంతంగా పర్యవేక్షించే అవకాశం ఉందని పాల్గొన్న అంగన్‌వాడీ కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.