chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 6:59 am Digital Edition : CHITTOORE EXPRESS

కృష్ణాపురం జలాశయం భూముల కబ్జాపై రైతుల ఆగ్రహం జలాశయం నుంచి మట్టి తరలింపు,  20 ఎకరాల ఆక్రమణ ఆరోపణలు – సమగ్ర విచారణకు డిమాండ్

కార్వేటినగరం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 17:

 

చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలోని కృష్ణాపురం జలాశయం భూముల ఆక్రమణ, అక్రమంగా మట్టి తరలింపు వ్యవహారంస్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జలాశయం పరిధిలోని ప్రభుత్వభూములను కొందరు ఆక్రమించి సాగు చేస్తున్నారనే ఆరోపణలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం,కార్వేటినగరం మండలానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు, ఆయన అనుచరుడితో కలిసి జలాశయం పరిధిలోని భూములను ఆక్రమించి, సుమారు 20 ఎకరాల్లో వివిధ రకాల చెట్లను నాటి సాగు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా జలాశయం ప్రాంతం నుంచి సుమారు వెయ్యి ట్రిప్పుల మేర మట్టిని ఇసుక బట్టీలు, వ్యవసాయ పొలాలకు అక్రమంగా తరలించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తిగా ఉన్న జలాశయం భూముల్లో ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని రైతులు పేర్కొంటున్నారు. జలాశయం భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, ఈ వ్యవహారంపై నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని, అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గమనిక: ఈ కథనంలో పేర్కొన్న ఆరోపణలు స్థానిక రైతులు, గ్రామస్తులు చేసినవి మాత్రమే. సంబంధిత వ్యక్తుల వివరణ, అలాగే అధికారుల స్పందన అందాల్సి ఉంది. వారి వివరణ లభించిన వెంటనే ప్రచురించబడుతుంది.