
గుడుపల్లి, చిత్తూరు ఎక్స్ప్రెస్,జూన్ 27:
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలం కుప్పిగానిపల్లి గ్రామంలో శనివారం కుప్పం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ యాదవ్, గుడుపల్లి ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొజెక్టర్ ద్వారా ప్రత్యేక అవగాహన వీడియోలను ప్రదర్శిస్తూ ధైర్యస్పర్శ కార్యక్రమం, మాదకద్రవ్యాల (డ్రగ్స్) వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాల నుంచి రక్షణ, మహిళల భద్రత, రోడ్డు భద్రత నియమాలు తదితర అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని పోలీసులు సూచించారు. అలాగే యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగంపై ప్రజలకు సూచనలు చేశారు. గ్రామస్థులు కార్యక్రమానికి విశేషంగా హాజరై పోలీసుల సూచనలను ఆసక్తిగా విన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నివారణకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.