
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 14:
కుప్పం కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ లోక్ అదాలత్లో మొత్తం 1083 కేసులు రాజీ ద్వారా పరిష్కారం అయినట్టు చిత్తూరు మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి, కుప్పం కోర్టు ఇన్చార్జ్ బి శిరీష తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రకాల సివిల్, క్రిమినల్ కేసులను పరస్పర రాజీతో పరిష్కరించడం జరిగిందన్నారు. అందులో భాగంగా సివిల్ కేసులు 15 పరిష్కరించబడగా, వాటికి సంబంధించి సుమారు రూ. 37,88,140, అలాగే క్రిమినల్ కేసులు 1068 పరిష్కరించబడి రూ. 15,95,453 మొత్తం పరిష్కారం జరిగినట్టు తెలిపారు. రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ వేదికగా నిలుస్తోందని, ఇందువల్ల కచ్చిదారులకు సమయం, ధనం ఆదా అవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెంచ్ సభ్యురాలిగా శైలజశ్రీ, ఏపీపీ, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె. చంద్రప్ప, పలువురు న్యాయవాదులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.