
కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 13:
చిత్తూరు జిల్లా పోలీసు శాఖ ఆదేశాల మేరకు, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ సూచనలతో కుప్పం డీఎస్పీ పార్థసారథి ఆధ్వర్యంలో సోమవారం కుప్పం పట్టణంలో ప్రత్యేక ఫుట్ పెట్రోలింగ్, ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, కుప్పం ఎస్ఐ బాబు పాల్గొని పట్టణంలోని ప్రధాన కూడళ్లు, బజార్లు, రద్దీ ప్రాంతాల్లో కాలినడకన పెట్రోలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రిస్తూ వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై మోటారు వాహన చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. అలాగే హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, కార్లలో సీటు బెల్ట్ వినియోగించడం, రాంగ్ రూట్లో ప్రయాణించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఇటువంటి ఫుట్ పెట్రోలింగ్, ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.