
కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 10:
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. కుప్పం పట్టణంలోని రైల్వే అండర్బ్రిడ్జి సమీపంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను కుప్పం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు ఆరు కిలోల గంజాయితో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు డిఎస్పి పార్థసారథి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు కుప్పం పోలీసులు రైల్వే అండర్బ్రిడ్జి ప్రాంతంలో వాహనాల తనిఖీలు చేపట్టగా, అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారి వద్ద గంజాయి లభ్యమవడంతో వెంటనే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా కుప్పం డీఎస్పీ మాట్లాడుతూ, కుప్పం సబ్డివిజన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని, ప్రజలు కూడా అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత జీవితంతో పాటు సమాజానికీ హానికరమని డీఎస్పీ సూచించారు. ప్రజల సహకారంతో గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు నిరంతరం ప్రత్యేక తనిఖీలు, నిఘా చర్యలు కొనసాగిస్తారని తెలిపారు. ఈ దాడులలో సీఐ మల్లేష్ యాదవ్, ఎస్సైలు రామకృష్ణ, బాబులతోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నట్టు తెలిపారు.