chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 2:56 pm Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పంలో కల్తీ పాలపై వస్తున్న వార్తలు అసత్యం – కుప్పం డి.ఎస్.పి పార్థసారథి  

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి 13:

సామాజిక మాధ్యమాలు, కొన్ని న్యూస్ ఛానళ్లలో కుప్పం నియోజకవర్గంలో కల్తీ పాలు తయారీ, విక్రయాలు జరుగుతున్నాయంటూ వస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని కుప్పం డి.ఎస్.పి పార్థసారథి పత్రికా ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. గత రెండు మూడు రోజులుగా కుప్పంలో కల్తీ పాలు తయారు చేసి విక్రయిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుండటంతో ప్రజల్లో అయోమయం నెలకొన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కుప్పం నియోజకవర్గ పరిధిలో ఎక్కడా కల్తీ పాలు తయారీ లేదా విక్రయాలు జరగలేదని స్పష్టంగా పేర్కొన్నారు. కల్తీ పాలు తయారీకి సంబంధించిన ప్రధాన నిందితులు శాంతిపురం, గుడుపల్లి, రామకుప్పం మండలాలకు చెందినవారైనా, వారు కర్ణాటక రాష్ట్ర పరిధిలోనే ఈ అక్రమ కార్యకలాపాలు నిర్వహించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. కర్ణాటక ప్రభుత్వ మిల్క్ పౌడర్, బయట మార్కెట్‌లో లభించే మిల్క్ పౌడర్, పామ్ ఆయిల్ ఉపయోగించి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో కెజిఎఫ్ అండర్సన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్లగిరి గ్రామంలో ప్రత్యేక దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో వెంకటేష్, బాలాజీతో పాటు పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని, ఎస్సెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత వివిధ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణలో ట్రాన్స్‌పోర్టర్లు, మిల్క్ పౌడర్ సరఫరాదారులు, కల్తీ పాలు కొనుగోలు చేసిన వ్యక్తులను కూడా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో కల్తీ పాలను పూర్తిగా కర్ణాటక రాష్ట్ర పరిధిలోనే తయారు చేసి అక్కడి డైరీలకు మాత్రమే సరఫరా చేసినట్లు తేలిందని, కుప్పం నియోజకవర్గంలోని ఏ డైరీకీ ఈ పాలు చేరలేదని పోలీసులు స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.