chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 8:12 am Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పంలో అరాచకం పెరిగింది : ఎమ్మెల్సీ భరత్ విమర్శ

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 12:

 

కుప్పం నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు, పెరిగిపోయాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ భరత్ విమర్శించారు. కుప్పంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివేదికలు తెప్పించు కున్న తర్వాతే స్థానిక ఇన్‌చార్జిని మార్చారని పేర్కొన్నారు. దీంతో కుప్పంలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందనే విషయం స్పష్టమవుతోందని అన్నారు. గ్రానైట్, ఇసుక, భూవ్యవహారాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన భరత్, ప్రజా వనరులను కొందరు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, రాజకీయ కక్షసాధింపులో భాగంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై మరింత బలంగా ఉద్యమాలు చేపడతామని భరత్ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.