
కడప,చిత్తూరు ఎక్స్ప్రెస్, జూలై 28:
కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, షెడ్యూల్ ఎంప్లాయిస్ వేతనాలను సవరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ డిమాండ్ చేశారు. మంగళవారం కడపలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో లక్షలాది మంది కార్మికులు తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని, ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఆప్కాస్, మున్సిపల్, విద్యుత్, వైద్య, విద్యా రంగాలతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంజాబ్ తరహాలో కార్మికులను రెగ్యులర్ చేయాలని, గ్రాట్యుటీ, పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఈ నెల 30న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ఆందోళనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, కోశాధికారి వెంకటసుబ్బయ్య, నాయకులు శ్రీనివాసులు రెడ్డి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.