
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఆగస్టు 15:
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కళలు, సంస్కృతి అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న సిరి కళాక్షేత్రం, హయగ్రీవ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ గ్యాలరీ నిర్వాహకురాలు శ్రీమతి కటారి సునీత మహేష్కు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రశంసా పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అందజేసిన ఈ పురస్కారాన్ని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా ఆమె స్వీకరించారు. చిత్తూరు జిల్లా ట్రైనింగ్ సెంటర్ పెరేడ్ గ్రౌండ్స్లో శనివారం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం జరిగింది. కుప్పం నియోజకవర్గంలో కళలు, సాంస్కృతిక వారసత్వం, హస్తకళలను పరిరక్షిస్తూ వాటి అభివృద్ధికి చేస్తున్న సేవలను గుర్తించి కటారి సునీత మహేష్కు ఈ ప్రశంసా పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్,జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్,జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు చెందిన నరేంద్ర తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కటారి సునీత మహేష్ మాట్లాడుతూ.., కళలు, సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు చేస్తున్న కృషికి లభించిన ఈ గుర్తింపు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కళలు, సంస్కృతి, పర్యాటక రంగాల అభివృద్ధికి నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోను కుప్పం ప్రాంతంలోని సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి, కళాకారులను ప్రోత్సహించేందుకు మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు.