
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 12:
నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, పార్టీ సిద్ధాంతాల ప్రచారం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో చురుకుగా పనిచేస్తున్న పార్టీ నాయకుడు కన్నన్ సేవలను గుర్తిస్తూ ప్రత్యేక ప్రోత్సాహక లేఖను పంపించారు. ఈ సందర్భంగా పీకేఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ బి.ఆర్. సురేష్ బాబు మాట్లాడుతూ, పార్టీ నాయకత్వం కన్నన్ పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కన్నన్ చేస్తున్న కృషిని పార్టీ అధిష్ఠానం గుర్తించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ ప్రోత్సాహం భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో ప్రజాసేవ చేయడానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కన్నన్ స్పందిస్తూ ఈ గుర్తింపు నాకొక్కడికే చెందినది కాదు… నాతో పాటు పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు చెందినది అని, తన వెంట పార్టీ బలోపేతానికి పనిచేస్తున్న ప్రతి ఒక టిడిపి అభిమానికి తన ప్రశంస పత్రాన్ని అంకితం చేశారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు మరింత కృషి చేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయిలో కార్యకర్తలతో కలిసి పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు కన్నన్ ను అభినందించారు.