chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 3:49 pm Digital Edition : CHITTOORE EXPRESS

ఏనుగుల బీభత్సం.. మామిడి తోటల ధ్వంసం బాధిత రైతులను పరామర్శించిన పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు

రామకుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మే 30

 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం నానియాల గ్రామ సరిహద్దుల్లోని మామిడి తోటల్లోకి ఏనుగుల గుంపు ప్రవేశించి పంటలను ధ్వంసం చేసిన ఘటన రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. విషయం తెలుసుకున్న వెంటనే పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఏనుగుల దాడితో నష్టపోయిన మామిడి తోటలను పరిశీలించిన ఆయన, బాధిత రైతులతో మాట్లాడి జరిగిన నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విన్న డాక్టర్ సురేష్ బాబు వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…, ఏనుగుల దాడి వల్ల పంటలు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం తరపున తగిన పరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అలాగే అటవీ శాఖ అధికారులతో మాట్లాడి గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్న ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. గ్రామ ప్రజలు,రైతులు అప్రమత్తంగా ఉండాలని,ఏనుగుల సంచారం ఉన్న ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండి అటవీ శాఖ అధికారుల సూచనలను పాటించాలని కోరారు. రైతుల సంక్షేమం, వారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని డాక్టర్ సురేష్ బాబు స్పష్టం చేశారు. ఏనుగుల సంచారంతో భయాందోళనకు గురవుతున్న గ్రామాల్లో భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయాలని గ్రామస్తులు ఈ సందర్భంగా అధికారులను కోరారు.