
శాంతిపురం,చిత్తూరు ఎక్స్ప్రెస్,ఆగస్టు15:
చిత్తూరు జిల్లా శాంతిపురం మండల పరిధిలోని గడ్డూరులో ఉన్న ఏడిఫై ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాళ్లబూదుగూరు ఎస్సై నరేష్, రిటైర్డ్ హెడ్మాస్టర్ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం జాతీయగీతాన్ని ఆలపిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు దేశభక్తి భావాలను చాటుకున్నారు. స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాసులు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశ అభివృద్ధి కోసం ఐకమత్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం శాంతిపురం వైఎస్సార్ సర్కిల్లో విద్యార్థులు ఫ్లాష్మాబ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, స్వాతంత్ర్య స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలతో స్థానికులను ఆకట్టుకున్నారు. విద్యార్థుల ప్రదర్శనలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించగా, పలువురు ఉత్సాహంగా పాల్గొని వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ నవనీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.