
సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 25:
తిరుపతిపట్టణంలో నిర్వహించబడనున్న ఏఐటియుసి 18వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 17వ రాష్ట్ర మహాసభలు జరిగిన గుంటూరు నుండి బయలుదేరిన జీపు జాతకు సూళ్లూరుపేట పట్టణంలో కార్మికులు ఘన స్వాగతం పలికారు. జీపు జాతను ఉద్దేశించి రాష్ట్ర నాయకులు అంజిబాబు, సిపిఐ సీనియర్ నాయకులు పార్థసారథి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కార్మికులను ఏకతాటిపైకి తెచ్చిన ఏఐటియుసి గత 106 సంవత్సరాలుగా కార్మిక సంక్షేమం కోసం నిరంతరం పోరాటం సాగిస్తోందని తెలిపారు. కార్మికుల హక్కుల రక్షణ ధ్యేయంగా అనేక వీరోచిత పోరాటాలకు నాయకత్వం వహిస్తూ, కార్మిక చట్టాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు శ్రామిక రంగాన్ని ఉద్యమ బాటలో నడిపిస్తున్నాయని అన్నారు. ఈ విధానాలను ప్రజలంతా ఏకమై ఖండిస్తున్న నేపథ్యంలో తిరుపతి లో జరగనున్న రాష్ట్ర మహాసభలు కీలకమని తెలిపారు. మహాసభలను జయప్రదం చేయడానికి కార్మిక లోకం పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపుని చ్చారు. గుంటూరు నుండి ప్రారంభమైన జీపు జాత సూళ్లూరుపేటకు చేరుకోవడం ఆనందదాయకమని, స్థానిక కార్మికులు ఇచ్చిన ఆతిథ్యంఉత్సాహాన్ని పెంచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటి యుసి నియోజకవర్గ అధ్యక్షులు, కార్య దర్శులు శ్రీనివాసులు, నాగేంద్రబాబు, రమణయ్య, బాలు, లక్ష్మమ్మ, బాలయ్య, నాగరాజు, బాబు, పాళ్లెయ్య తదితరులు పాల్గొన్నారు.