chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 8:58 am Digital Edition : CHITTOORE EXPRESS

ఉపాధి హామీ పథకంలో రూ.6.67 కోట్ల బిల్లుల చెల్లింపు

 

శాంతిపురం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూన్06:

 

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.6.67 కోట్ల బిల్లులను లబ్ధిదారులు, సరఫరాదారుల ఖాతాలకు జమ చేసినట్లు ఎంపీడీఓ ఏపీఆర్ కుమార్ తెలిపారు. శనివారం కడపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని పోడూరు గ్రామంలో జరుగుతున్న జలధార ఫీడర్ కాలువ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. జలధార కార్యక్రమం కింద మండలంలో 43 పనులకు మొత్తం రూ.2.28 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను ఈ నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. జలధార పనుల ద్వారా రానున్న వర్షాకాలంలో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, భూగర్భ జలాలు పునరుద్ధరించబడటంతో నీటి సమస్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సిమెంటు రోడ్లు, చెక్ డ్యాంలు, గోకులం షెడ్లు, పశువుల నీటి తొట్టెలు, ఇంకుడు గుంతలు, మల్బరీ యూనిట్లకు సంబంధించిన గత ఆర్థిక సంవత్సర బకాయిలు రూ.6.67 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు, సరఫరాదారుల ఖాతాలకు జమ చేసినట్లు వెల్లడించారు. అయితే ఇంకా 60 పనులకు సంబంధించిన సుమారు రూ.62 లక్షల బిల్లులు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. పనులు పూర్తి చేసినప్పటికీ ఖాతాల్లో నగదు జమ కాకపోతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని లబ్ధిదారులను కోరారు. ఈ తనిఖీ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి అంజద్ బాషా, క్షేత్ర సహాయకుడు బాలకృష్ణ, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.