chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 6:10 pm Digital Edition : CHITTOORE EXPRESS

ఉపాధి హామీ కూలీలకు కొలతలకు అతీతంగా వేతనం ఇవ్వాలని సిపిఐ డిమాండ్

చిత్తూరు  ఎక్స్ ప్రెస్, శ్రీకాళహస్తి రూరల్ :

శ్రీకాళహస్తి మండలం ముచ్చువోలు గ్రామ పంచాయతీలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మించల శివకుమార్ పరిశీలించారు, గ్రామీణ ప్రాంతాలలో యువకులు, మహిళలు వలస వెళ్లకుండా నివారించడానికి ఎర్రజెండాల పోరాట ఫలితంగా సాధించుకున్న చట్టాన్ని ఉపాధి కూలీలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఉపాధి హామీ పని జరిగే చోట త్రాగునీరు, మజ్జిగ, మెడికల్ కిట్టు, టెంట్లు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు, వేసవికాలం ఆరంభం కావడంతో ఎండలు విపరీతంగా ఉండటంతో కూలీలకు అదనంగా వేతనాలు మంజూరు చేయాలని ఆయన కోరారు. కూలీలకు పనిముట్లు కల్పించి, గత 15 సంవత్సరాలుగా జరుగుతున్న ఈనాటికీ పరికరాలు కూలీలకు అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు, జాబ్ కార్డులకు అతీతంగా పని కల్పించాలని, 200 రోజులు పని దినాలు కల్పించి, రోజుకు 600 రూపాయలు అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉపాధి హామీ కూలీలను కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ కిరణ్, సువర్ణ, సుధా కుమారి, గిరిజ, సుభాషిని, మాధవి, ఉష, భూలోకం, నారాయణ, విజయ తదితరులు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.