
హిందూపురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే30:
హిందూపురం పట్టణం త్యాగరాజ నగర్ లోగల మార్గదర్శి విద్యానికేతన్ పాఠశాల ఆవరణంలో కొనసాగుతున్న 28 వ సంవత్సరం ఉచిత వేసవిబడి విద్యార్థులకు శనివారం వైద్య ఆరోగ్య శిబిరం,భోజనాల ఏర్పాట్లు చేయడం జరిగిందని నిర్వాహకులు కె.సాయికళ-కె.మాళప్ప దంపతులు పేర్కొన్నారు. రాజ్యలక్ష్మి ఫ్లవర్ డెకరేషన్ నాగరత్న మోహన్ కుమార్ దంపతుల సౌజన్యంతో నిర్వహిస్తున్న ఉచిత వేసవిబడి విద్యార్థులకు హిందూపురం పట్టణంలో ఉన్న అంజన్ కుమార్ ఆర్తో & న్యూరో కేర్ రిహాబిలేషన్ ఆసుపత్రి వైద్యులు సుహాసిని అంజన్ కుమార్ దంపతులు ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం, అన్నదానం ఏర్పాట్లు చేశారు. డాక్టరు అంజన్ కుమార్ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టరు అంజన్ కుమార్ ప్రసంగించారు. వైద్యులకు నిరంతరం శ్రమ వత్తిడితో సతమతమవుతున్న సమయంలో ఒక రోజు రెండు గంటల పాటు చిన్నారుల మధ్యలో గడిపి వారికి వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి స్వయంగా తాము భోజన ఏర్పాట్లు చేయడం సంతృప్తి నిచ్చిందని పేర్కొన్నారు. ఇదే రోజు ఉదయం బెంగళూరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తరపున యోగా మాస్టర్లు శ్రీనివాస రెడ్డి, నలనాక్షి, సుబ్రమణ్యం, ఆనంద్ విద్యార్థులకు యోగా తరగతులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాళప్ప, కె.సాయికళ, మమత, గాయిత్రి, సాయి,విద్యార్థులు పాల్గొన్నారు.