
రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 10 :
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై రేణిగుంట మండలం ఆర్. మల్లవరం గ్రామ పంచాయతీ సచివాలయంలో శుక్రవారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏలు), సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వే పురోగతిని సమీక్షించి,అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బోగస్ ఓట్లకు తావు లేకుండా పూర్తిస్థాయి పారదర్శకతతో ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలని అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు వెన్నెముకలాంటిదని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అలాగే ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన పెంపొందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను బాధ్యతాయుతంగా,పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు.