chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 11:58 am Digital Edition : CHITTOORE EXPRESS

ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు.. ముందస్తు వైద్యం తీసుకోవాలి పీఈఎస్ ఆసుపత్రిలో బాధిత మహిళను పరామర్శించిన 11వ క్లస్టర్ నాయకులు

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 10:

 

ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని కుప్పం మున్సిపాలిటీ 11వ క్లస్టర్ నాయకులు ప్రజలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవిని పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కుటుంబానికి మెరుగైన వైద్య సేవలు అందించడమే సంజీవిని పథకం లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.  కుప్పం మున్సిపాలిటీ 11వ క్లస్టర్ పరిధిలోని మోడల్ కాలనీకి చెందిన ఓ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను కుప్పంలోని పీఈఎస్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న 11వ క్లస్టర్ ఇంచార్జి కన్నన్, యూనిట్ ఇంచార్జి బాబు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు నాగభూషణం, సోమశేఖర్, మాజీ ఉపాధ్యక్షుడు సోము, దిలీప్ ఆసుపత్రికి చేరుకుని బాధిత మహిళను పరామర్శించారు. అనంతరం వైద్యులను కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్య సేవలు అందించి త్వరగా కోలుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య సిబ్బందిని కోరారు. అలాగే కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువయ్యేలా చర్యలు చేపడుతోందని తెలిపారు. ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా తీవ్ర అనారోగ్య పరిస్థితులను నివారించవచ్చన్నారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు, ఆరోగ్య పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి కుటుంబం ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనేక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతమైన చికిత్స పొందవచ్చని పేర్కొన్నారు.