chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 7:40 am Digital Edition : CHITTOORE EXPRESS

ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనంతో చోరీలకు పాల్పడిన  సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అరెస్ట్.. రూ.4.40 లక్షల విలువైన బంగారం స్వాధీనం

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 04:

 

ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనానికి గురై రైళ్లలో, రైల్వే స్టేషన్‌లలో చోరీలకు పాల్పడుతున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రేణిగుంట రైల్వే పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.4.40 లక్షల విలువైన 36 గ్రాముల బంగారం, ల్యాప్‌టాప్, డిజిటల్ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా జిఆర్పి డీఎస్పీ ప్రమోద్ ఆదేశాల మేరకు, జిఆర్పి సిఐ యతీంద్ర ఆధ్వర్యంలో ఎస్సై మధుసూదన్ రావు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టగా గురువారం రేణిగుంట రైల్వే స్టేషన్‌లో నిందితుడిని పట్టుకున్నారు. అరెస్టైన రమేష్ రెడ్డి (33) అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందినవాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తు ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో నష్టపోయి అప్పుల పాలవడంతో చోరీల బాట పట్టినట్లు విచారణలో వెల్లడైంది.నిందితుడిపై గుంతకల్ రైల్వే పోలీసు స్టేషన్‌లో ఎనిమిది, గుత్తి రైల్వే పోలీసు స్టేషన్‌లో ఒక కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రేణిగుంటలో నమోదైన ఐదు చోరీ కేసులకు సంబంధించిన బంగారాన్ని అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.కేసును ఛేదించిన యతీంద్ర,మధుసూదన్ రావు,పోలీసు సిబ్బంది గురుమూర్తి,ఏలుమలై, అంజిబాబు,రేవంత్‌తో పాటు సహకరించిన చెన్నై,రేణిగుంట రక్షణ దళ సిబ్బందిని జిల్లా రైల్వే పోలీసు అధికారి ప్రమోద్ అభినందించారు.రైళ్లలో ప్రయాణించే సమయంలో విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.