chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 7:19 am Digital Edition : CHITTOORE EXPRESS

ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు ఈవో రామకృష్ణా రెడ్డి

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఆగస్టు 3

రేణిగుంట మండలం తూకివాకం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్–6లో మర్రిగుంట వద్ద ఉన్న దేవాదాయ శాఖకు చెందిన భూముల పరిరక్షణ కోసం అధికారులు సోమవారం చర్యలు చేపట్టారు. దేవాదాయ శాఖ ఈవో రామకృష్ణా రెడ్డి ఆదేశాల మేరకు జేసీబీతో భూమి సరిహద్దుల వద్ద గుంతలు తవ్వించి ఆక్రమణలను అడ్డుకునే చర్యలు ప్రారంభించారు.ఇటీవల దేవాదాయ శాఖ భూములపై అక్రమంగా కన్నేసి ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా ముందస్తు చర్యగా భూమి సరిహద్దులను స్పష్టంగా గుర్తిస్తూ గుంతలు తవ్వించినట్లు అధికారులు తెలిపారు. అవసరమైతే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు భూములను నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎండోమెంట్స్ ఈవో రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ  దేవాదాయ శాఖకు చెందిన ప్రతి అంగుళం భూమిని పరిరక్షించడం తమ బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ, దేవాదాయ భూములను ఆక్రమించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా భూమిలోకి ప్రవేశించడం, హద్దులు మార్చడం, నిర్మాణాలు చేపట్టడం లేదా ఇతర ఆక్రమణలకు పాల్పడితే సంబంధిత చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.