పలమనేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 01:
పలమనేరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని తన కార్యాలయంలో రెవిన్యూ, మున్సిపల్,అటవీ,వైద్య శాఖ అధికారులతో ఆయన విడివిడిగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల పురోగతిపై వివరాలు రాబట్టారు. ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి విషయంగా ఉన్న అవరోధాలను ఆర్డిఓ భవాని తో పాటు తహసిల్దార్ ఇన్భనాథన్ ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ విషయంపై ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశం వారంలోపు తేల్చాలని, వెంటనే ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ఇక ఆలస్యం జరగకూడదని అధికారులను ఆయన హెచ్చరించారు. అదేవిధంగా పలమనేరు రూరల్ మండలంలోని ఓ రోడ్డు నిర్మాణం విషయంలో అటవీ శాఖ అధికారులు అభ్యంతరం తెలపడంపై ఆయన వారితో చర్చించారు. రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మరోవైపు స్థానిక ఏరియా ఆసుపత్రిలో రోగుల సౌకర్యర్థం ఏర్పాటు చేయదలచిన లిఫ్ట్ మరియు ఫ్రీజర్ రూమ్ ఏర్పాటు, బ్లడ్ బ్యాంక్ తదితర అంశాలపై వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో సబ్ డి ఎఫ్ వేణుగోపాల్ రెడ్డి,ఎఫ్ ఆర్ ఓ నారాయణ, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి,సిబ్బంది ,ఆసుపత్రి సూపర్ ఇంటెండెంట్ మమతా రాణి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.