
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే15:
చిత్తూరు జిల్లా కుప్పంలో జరుగుతున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా స్థానిక చిత్రకారుడు పురుషోత్తం (పూరి ఆర్ట్స్) వినూత్న చిత్రకళతో భక్తులను ఆకట్టుకుంటున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి నామాలతో ఆయన చెల్లెలిగా భావించే శ్రీ తిరుపతి గంగమ్మ రూపాన్ని ప్రత్యేకంగా రూపొందించిన చిత్రాన్ని జాతరకు తీసుకువస్తున్నారు. “గోవింద” నామాలతో పాటు “తిరుపతి గంగమ్మ” రూపొందించిన ఈ చిత్రం భక్తి భావాన్ని ప్రతిబింబించేలా ఉండటంతో స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్న నామాలతో చెల్లెలి చిత్రాన్ని రూపొందించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చిత్రకారుడు పురుషోత్తం తెలిపారు. గంగమ్మ జాతర సందర్భంగా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా ఈ కళాఖండాన్ని సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఈ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని జాతర నిర్వాహకులు, భక్తులు అభిప్రాయపడుతున్నారు.