chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 7:23 am Digital Edition : CHITTOORE EXPRESS

అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్‌ప్రెస్:
శ్రీకాళహస్తి ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న అన్న క్యాంటీన్ సేవలు నాణ్యంగా, పరిశుభ్రంగా అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు మున్సిపల్ కమిషనర్ కె.వి. కృష్ణారెడ్డి మంగళవారం రామసేతు బ్రిడ్జి సమీపంలోని అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అల్పాహారం తీసుకుంటున్న లబ్ధిదారులతో కమిషనర్ నేరుగా మాట్లాడి ఆహార నాణ్యత, రుచి, పరిశుభ్రత, పరిమాణం, సిబ్బంది సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. అనంతరం క్యాంటీన్ వంటశాల, భోజన ప్రాంగణం, తాగునీటి సౌకర్యం, పరిసరాలను పరిశీలించిన కమిషనర్, క్యాంటీన్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా నిర్వహించాలని సూచించారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని తయారు చేసి లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేశారు. క్యాంటీన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ నాణ్యమైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో అన్న క్యాంటీన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, శానిటరీ సెక్రటరీతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.