chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 10:39 pm Digital Edition : CHITTOORE EXPRESS

అంబేద్కర్ స్ఫూర్తితో దళితులు విద్యతో ముందుకు రావాలి:  దగ్గుమల్లు ప్రసాదరావు, మురళీమోహన్

ఈచిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 14:

ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి దళిత బిడ్డ విద్యను అభ్యసించి రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు దగ్గుమల్లు ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ కలను సాకారం చేయడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలను జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిత్తూరులోని మెకానికల్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ దగ్గుమల్లు ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఎమ్మెల్యే మురళీమోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చూడా చైర్పర్సన్ కటారి హేమలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన నాయకులు అంబేద్కర్ విద్యను సామాజిక సాధికారతకు ప్రధాన ఆయుధంగా భావించిన మహానేత అని కొనియాడారు. “చదవండి, సంఘటితమవండి, పోరాడండి” అనే నినాదంతో అణగారిన వర్గాల్లో చైతన్యం నింపిన యోధుడని పేర్కొన్నారు. అంటరానితనం వంటి సామాజిక దురాచారాలపై జీవితాంతం పోరాడిన అంబేద్కర్, రాజ్యాంగ రూపకర్తగా ప్రతి పౌరునికి సమాన హక్కులు కల్పించారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల కోసం రిజర్వేషన్లు మరియు రక్షణ చట్టాలను తీసుకువచ్చిన దళిత బాంధవుడని కొనియాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పాన్ని ప్రస్తావిస్తూ ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి పారిశ్రామిక వేత్తలు తయారవ్వాలని, ప్రతి ఇంటి నుంచి అభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు ఈ దిశగా ఉపయోగపడతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ సామాజిక రుగ్మతలను నిర్మూలించడంలో అంబేద్కర్ కృషి అమోఘమని అన్నారు. ఆయన చూపిన మార్గంలో ఎస్సీ, ఎస్టీలు తమ హక్కులను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన 47 స్వయం సహాయక సంఘాలకు పిఎం అజయ్ పథకం కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన వడ్డీ లేని రుణాలుగా 47 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో డీఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, డీఆర్‌డీపీడీ శ్రీదేవి, మాల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్లు పి. యుగంధర్, బాబు, వివిధ సంఘాల నాయకులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.