chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 10:57 am Digital Edition : CHITTOORE EXPRESS

అంగన్‌వాడీ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ ముట్టడి విజయవంతం చేయాలి:  బి. లక్ష్మీదేవి

కడప,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూలై31:

 

అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జూలై 31న కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ అనుబంధ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. లక్ష్మీదేవి పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన సమావేశంలో ఆమెతో పాటు జిల్లాకోశాధికారి ఎంపీ అంజలిదేవి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు ఆరు నెలలు గడిచినా అంగన్‌వాడీ ఉద్యోగుల వేతనాల పెంపుపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అంగన్‌వాడీ వర్కర్లకు వేతనాలు పెంచాలని, నవచేతన యాప్‌ను రద్దు చేయాలని, మినీ వర్కర్లందరినీ మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని, అర్హులైన హెల్పర్లకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. యాప్‌ల పేరుతో పనిభారం పెంచుతున్నారని, తక్కువ వేతనాలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, కేంద్రాలకు అవసరమైన అడ్వాన్స్‌లను ప్రభుత్వం అందించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే కలెక్టరేట్ ధర్నాలో అంగన్‌వాడీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు శాంతి తదితరులు పాల్గొన్నారు.